ఆత్మకూరురూరల్: నల్లమల అడవుల మీదుగా సాధారణ నడకతో ప్రయాణించడమంటేనే అది ఒక సాహసం. ఆ పర్వతప్రాంతంలో శిఖరాలు అధిరోహిస్తు లోయల్లోకి దిగడం సాధారణ స్థితిలోనే ప్రాణాంతకం. అలాంటిది నాలుగు అడుగుల కృత్రిమ కాళ్లను (కర్రకాళ్లు) కట్టుకుని కొండ ఎక్కడం కాని, లోయలలోకి దిగడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. అయితే ఉగాది పరిశకు హాజరయ్యేందుకు కన్నడిగులు పాదయాత్రతో అధిక మంది నల్లమల మీదుగా నడుస్తుండగా కొందరు మాత్రం ప్రత్యేకంగా మరగాళ్లతో వస్తుంటారు. నాగలూటి వద్ద మెట్లు ఎక్కేటప్పుడు, భీముని కొలను వద్ద శిఖరం ఎక్కడం, దిగడం మరగాళ్లతో నడవడం కష్టసాధ్యమైనది. ఏమాత్రం జారినా 80 అడుగుల లోయల్లో పడిపోవాల్సిందే. కొందరు సహచరులు మరగాళ్లతో నడిచే వారిని తాళ్లతో కట్టి బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తారు. ఇంతటి ప్రమాదకర ప్రయాణం చేసే వీరిని చూస్తే మధ్య యుగాలలో వీరశైవ మతం అవలంభించే వారు గుర్తుకొస్తారు. వారు తమ మొక్కులను భీకరంగా మొక్కే వారు. అంతే భీకరంగా వాటిని తీర్చుకునే వారు. కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీశైలంలో మహాశివుడికి తమ తలలను తెగ నరుక్కుని ఆత్మార్పణ గావించుకునే వారు. ఆ పరంపరలో తమ శరీరాలను కష్టపెట్టే మహాభక్తి నేటి తరాల్లో కూడా ఇలా కనిపిస్తూ ఆశ్చ్యర్యాన్ని కలిగిస్తోంది.


