కర్నూలు(సెంట్రల్): ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5వ తేదీన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివలక్ష్మి ఆరోపించారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ అధ్యక్షతన ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు చాలీచాలనీ వేతనాలు ఇస్తూ రోజుకొక యాప్తో వేధిస్తోందని విమర్శించారు. కనీస వేతనం రూ.26 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలి కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణపాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్యుడి మృతి
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్నగర్లో నివాసం ఉంటున్నారు. గాయత్రీ ఎస్టేటులోని అర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. తండ్రి జయరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుబ్రమణ్యేశ్వరుడికి వెండిపడిగెలు వితరణ
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామికి ఆదివారం రెండు వెండి పడిగెలు భక్తులు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు 500 గ్రామలు, బండిఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య 485 గ్రాముల వెండి పడిగెలు ఇచ్చారని తెలిపారు.


