శిల్పాలు చెప్పిన చరిత్ర
నల్లమల దట్టమైన అడవే కాదు.. కొన్ని వేల ఏళ్ల చరిత్రను కూడా తన కడుపులో నిక్షిప్తం చేసుకున్న భోషాణం కూడా. ఈ అడవిలో కనిపించే శిథిలాలయాలు, అక్కడక్కడా కనిపించే ఖండిత శిల్పాలు దీన్ని రుజువు పరుస్తుంటాయి. నాగలూటి చెంచు గూడెం సమీపంలో ఒక ప్రాచీన ఆలయ అవశేషాలు కనపడతాయి. ఒక ఆలయ పునాదులు, వాటి మధ్య ఒక సదాశివ శిల్పం మకుటంతో కూడిన శిల్పం మాత్రమే కనిపిస్తోంది. ఈ శిల్పాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ శిల్పం తలను అలంకరించిన కిరీటం చెక్కిన పద్ధతి చూస్తే దీన్ని జటామకుటంగా అనిపిస్తోంది. పొరలు పొరలుగా ఉండేటట్టు శిల్పాల మకుటాలు చెక్కుతారు. ఈ శిల్పం క్రీ.శ 9 వ శతాబ్దికి చెందిన బాదామి చాళుక్యులు కాని, 13 శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలానికి చెందినదై ఉండవచ్చని చరిత్ర పరిశోధకులు అంటున్నారు. శిల్పం కోసం తీసుకున్న తడి రాయి (ఇసుక రాయి)ని పరిశీలిస్తే అందులోని కొంత ముతక తనాన్ని చూస్తే ఇది ఖచ్చితంగా చాళుక్యుల కాలం నాటిది గానే స్పష్టం చేయవచ్చు. అలాగే నాగలూటి వీరభధ్రాలయం వద్ద ఉన్న మెట్ల మార్గం మొదట్లో ఉన్న అమ్మ వారి విగ్రహం, అలాగే ఆ పక్కనే ఉన్న అష్టభుజి వినాయక విగ్రహం కూడా నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఇప్పటికి నిలిచి ఉన్నాయి. పురావస్తుశాఖ దృష్టి నల్లమలపై సారించలేదన్న విషయం అందరికీ తెలుస్తోంది. ఇప్పటికై నా నల్లమలలోని గుమ్మితం శిలాశాసనాలు, వివిధ శిథిలాలయాలను పరిశోధించాల్సి ఉంది.
– ఆత్మకూరురూరల్
అష్టభుజి వినాయకుడు, నాగలూటి మెట్ల మార్గంలో అమ్మవారి విగ్రహం
శిల్పాలు చెప్పిన చరిత్ర
శిల్పాలు చెప్పిన చరిత్ర


