రైతులకు మేలు చేసే అవకాశం దక్కింది
కర్నూలు సిటీ: జలవనరుల శాఖలో విధులు నిర్వర్తిస్తూ రైతులకు మేలు చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఉద్యోగ విరమణ పొందిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 ఎస్ఈ పి.పాండురంగయ్య అన్నారు. శనివారం బీక్యాంపులోని ఓ ఫంక్షన్హాలులో హంద్రీనీవా ఇంజినీర్లు రిటైర్డ్ ఈఈ విశ్వనాథ్ అధ్యక్షతన పాండురంగయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఇంచార్జీ సీఈ ఎస్.కబీర్ బాషా, రిటైర్డ్ సీఈలు చిట్టిబాబు, నాగరాజు, మురళీనాథ్ రెడ్డి, ఎస్ఈలు బాలచంద్రారెడ్డి, ప్రతాప్, శుభకుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్ఈ పార్థసారథిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత పి.పాండురంగయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం వచ్చిన తనకు సాగునీటి కష్టాలు తెలుసునన్నారు. తమకు గురువు ఎ.సుబ్బారెడ్డి అని గుర్తు చేశారు. హంద్రీనీవా కాలువ నిర్మాణ అయ్యే సమయంలోను, జాతికి అంకితం చేసిన సమయంలోను, విస్తరణ చేసిన సమయంలోను తాను ఎస్ఈగా పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడిన ఇంజినీర్లు జల వనరుల శాఖలో పి.పాండురంగయ్య చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హంద్రీనీవా డిప్యూటీ ఎస్ఈ ఉషారాణి, ఈఈలు చంద్రశేఖర్ రెడ్డి, గుణఖర్ రెడ్డి, ప్రసాద్, రాజన్బాబు, డీఈఈ,తదితరులు పాల్గొన్నారు.


