ప్రతి పేజీ మోసమే!
రెండేళ్లు కావస్తున్నా అందని పాసుపుస్తకాలు
కర్నూలు(సెంట్రల్): పట్టదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్తగా రాజముద్రతో ఇస్తామని ఊరించింది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇప్పటికీ అరకొరగానే మంజూరు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీటిని రైతులకు అందించేందుకు ఎమ్మిగనూరు మండలం కలుగోట్లలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 472 గ్రామాలకు 254 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి 1.92,472 మంది రైతులకు జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల ముందు రీసర్వేపై చంద్రబాబుతో పాటు పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల భూములు లాక్కుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే రీసర్వేను నిలుపుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే 2025 జనవరి 20 నుంచి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు–భూరక్ష పథకం పేరు మార్చి ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరిట రీసర్వే చేపడుతుండటం చూసి రైతులు అవాక్కవుతున్నారు. రెండేళ్ల తరువాత రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇస్తున్నా జిల్లాకు అరకొరగానే మంజూరయ్యాయి. మొత్తం 1,92,472 మంది రైతుల్లో 84వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు చేరాయి.
కొత్త పాసుపుస్తకాల్లో తప్పులే తప్పులు
గత ప్రభుత్వం మంజూరు చేసిన జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టదారు పాసు పుస్తకాలను రద్దు చేసిన చంద్రబాబునాయుడు.. వాటి స్థానంలో రాజముద్రదతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాటిలో వివరాలు సక్రమంగా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఎల్పీ నంబర్, పేరు, ఇంటి పేరు, పాసు పుస్తకం నంబరు తదితర వివరాల్లో అచ్చు తప్పులు ఎక్కువగా దొర్లడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల తరువాత ఇస్తున్నా వాటిలో అన్నీ తప్పులే ఉండటం పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వ రీసర్వేపై టీడీపీ,
జనసేన దుష్ప్రచారం
అధికారంలోకి రాగానే తిరిగి
రీసర్వేకు శ్రీకారం
పాత పుస్తకాలను రద్దుచేసిన
టీడీపీ ప్రభుత్వం
ఇప్పటి వరకు అరకొరగానే
పాసుపుస్తకాలు
బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు
రైతుల అవస్థలు
నేడు కలుగొట్లలో
సీఎం చంద్రబాబు పర్యటన


