కల్వర్టు గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి/కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులు, మద్దమ్మ ఒక్కగానొక్క కుమారుడు బోయ హరికృష్ణ (25) వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇటీవల కాలు బెనికింది. కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన బొల్లారం నాగమద్దయ్యతో పరిచయం ఉండటంతో ఇద్దరు కలిసి బైక్పై నాటువైద్యం చేయించుకునేందుకు గోనెగండ్ల ఆలువాల గ్రామానికి వెళ్లాడు. నాటు వైద్యం చేయించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో వెంకటగిరి, ఎర్రకత్వ గ్రామాల మధ్య కల్వర్టు కోసం తవ్విన గుంత వద్ద డైవర్షన్ రోడ్డు వేసినా అందుకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయక పోవడంతో వేగంగా వస్తున్న వారు పది అడుగుల గుంతలో పడిపోయారు. బైక్ వెనుక కూర్చున్న చెరుకులపాడు బోయ హరికృష్ణ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, నాగమద్దయ్య గాయాలపాలయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో అటుగా వచ్చిన వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, సంఘటనా స్థలంలో సూచికలు లేకుండా నిర్మాణాలు చేపట్టిన సదరు కాంట్రాక్టరుపై సైతం చట్టపరమైన చర్యలకు విచారణ చేస్తున్నట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు బోయ హరికృష్ణకు వెల్దుర్తి పట్టణం కొండపేటకు చెందిన యువతితో రెండు నెలల క్రితమే వివాహమైంది.
కల్వర్టు నిర్మాణం వద్ద
సూచికలు ఏర్పాటు చేయని వైనం
బైక్పై వెళ్తూ గుంతలో పడిన ఇద్దరు
ఒకరు మృతి, మరొకరికి
తీవ్ర గాయాలు
కల్వర్టు గుంతలో పడి వ్యక్తి దుర్మరణం


