అటవీ ప్రాంతం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా సాక్షి, విజయవాడ: అడవితల్లిని అక్రమార్కులు చెరబడుతున్నారు. అధికారం అండతో కొందరు వందలాది చెట్లను నరికి.. రూ.లక్షలు గడిస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావం కనీసం గొంతు తడవడానికి కూడా నీరు లేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కళ్లముందే కనిపిస్తున్నా.. పచ్చని చెట్లను కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందే దారి తప్పుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. అక్రమ కలప వ్యాపారులు కొందరు అధికార పార్టీ పెద్దల అండతో పగలంతా ఫారెస్టులో చెట్లను నరకడం.. ఆపై మిషన్తో ముక్కలు చేసి.. చీకటి పడగానే ట్రాక్టర్లలో టింబర్ డిపోలకు, రహస్య ప్రాంతాలకు తరలించడం రివాజుగా మారింది. రాజధాని ప్రాంతంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోనే అడవులను చెరబడుతుంటే అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి పవన్ కల్యాణ్ కనీసం సమీక్షించిన సందర్భం లేదు. అమావాస్యకో.. పౌర్ణమికో మమ అనడం.. కుంకీ ఏనుగులతో నమస్కారాలు పెట్టించుకోవడం తప్ప.. ఫారెస్టుల్లో అక్రమాలపై నోరు విప్పిన పాపానపోలేదని జిల్లావ్యాప్తంగా సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
అలాగే జగ్గయ్యపేట డివిజన్ వ్యాప్తంగా 2వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ముఖ్యంగా వేదాద్రి, గండ్రాయి, జయంతిపురం, ధర్మవరప్పాడుతండా, బూదవాడ, రామచంద్రునిపేట, రావిరాల, గుండబోయినపాలెం, పోచంపల్లి గ్రామాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతం నుంచి ఇటుక బట్టి పరిశ్రమలకు అక్రమంగా కలపను ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళలో తరలిస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని రామచంద్రునిపేట, జయంతిపురం గ్రామాల్లోని ఇటుక బట్టి పరిశ్రమలకు చుట్టుపక్కల అటవీ ప్రాంతం నుంచి కలపను తెచ్చి ఒకచోట డంపు చేసుకుంటున్నారు.
● పగలు నరకడం,
రాత్రి వేళ తరలించడం
● ఇటుక బట్టీలకు భారీగా రవాణా
● అక్రమార్కులకు వరంలా
మారిన యుద్ధ ప్రభావం
● జగయ్యపేట, మైలవరం
నియోజకవర్గాల్లో శృతిమించిన దందా
● కళ్లు మూసుకుంటున్న అటవీశాఖ
● సొంతశాఖలో పరిస్థితిపై సమీక్షించని
డెప్యూటీ సీఎం పవన్
టన్ను రూ.3వేల వరకు..
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల పరిధిలో 20వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇదే నియోజకవర్గంలో ఇటుక బట్టీలు అధికంగా ఉండడంతో కలపకు డిమాండ్ ఉంటుంది. దీంతో కొందరు అడవిలో చెట్లను కోత మిషన్లతో ముక్కలుగా కటింగ్ చేసి ఇటుక బట్టీలతో పాటు టింబర్ డిపోలకు సైతం తరలిస్తున్నారు. అడవిలో లభించే నిద్రగన్నేరు, నరలేగి, రేగి, తుమ్మ, వేప, నల్లతుమ్మ వంటి చెట్లను కలప దొంగలు ఎక్కువగా నరికి తరలిస్తున్నారు. ఈ కలప అయితే దృఢంగా ఉండి ఇటుక బట్టీలలో ఎక్కువ సమయం మండే స్వభావం ఉంటుంది. దీంతో అక్రమార్కులు ఈ చెట్లనే ఎక్కువగా నరుకుతున్నారు. టన్ను కలపను ఇటుక బట్టీల నిర్వాహకులకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఒక్కొక్క బ్యాచ్ కలప దొంగలు ఒక ట్రాక్టరు ట్రక్కు అంటే 10 టన్నుల వరకు కలపను మిషన్లతో ముక్కలుగా చేసి తరలిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా పెద్ద తుమ్మ చెట్లను నరికి ఆ కలపను డింబర్ డిపోలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఒక చోట డంపు చేసి..