గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ.ఎం. రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితుడికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తారన్నారు. అత్యవసర సమయంలో డబ్బు కోసం వేచి ఉండకుండా బాధితుడికి తక్షణ వైద్యం అందేలా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ప్రమాదం జరిగిన ఒక గంటలోపు ఆసుపత్రికి చేర్చే వ్యక్తిని ‘గుడ్ సమరిటన్’గా గుర్తించి, ప్రోత్సహకంగా రూ. 25వేలు అందజేస్తారన్నారు. గుడ్ సమరిటన్లకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివరి నాటికి జిల్లాలో 583 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు.
ఆ ప్రాంతంపై ఫోకస్..
కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల్లో ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనే 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. పురేంద్ర, ఎన్హెచ్ఏఐ విజయవాడ పీడీ ఎం.విద్యాసాగర్, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ,
కమిషనర్ రాజశేఖరబాబు


