చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి. శివరామప్రసాద్ అన్నారు. పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్లు, డీలర్ల అసోసియేషన్ సంఘ నాయకులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ సరుకులను నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రేషన్డీలర్లకు సూచించారు. సరుకుల కేటాయింపులో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో డీడీలు చెల్లించి దిగుమతి చేసుకోవాలన్నారు. ఆంధ్ర మినీ మార్టు కార్యక్రమం ప్రాముఖ్యతను ఆయన రేషన్ డీలర్లకు వివరించారు. జిల్లాలోని 1059 రేషన్షాపుల్లో 275 రేషన్షాపులను మినీ మార్టులుగా ఏర్పాటు చేసేందుకు గుర్తించామన్నారు. మొదటి దశలో 68 రేషన్ డీలర్లను ఎంపిక చేశామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిలో నాణ్యమైన బియ్యాన్ని రూ. 52 చొప్పున అమ్మకాలు జరుపుతున్నామన్నారు.


