ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జై దుర్గ్గ.. జైజై దుర్గా అంటూ కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పులకించాయి. దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం తరలివచ్చారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికులతో పాటు వివాహ శుభముహూర్తం వేళ ఒక్కటైన నూతన వధువరులు, కుటుంబ సభ్యుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి జరిగే పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు సైతం విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ అధికం కావడంతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ.300 టికెట్లపై వీఐపీలు, సిఫార్సు లేఖలు ఉన్న వారితో పాటు భక్తులందరికీ బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో క్యూలైన్లను ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్బాబు పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొనగా, రాత్రి 9.30 గంటల వరకు భక్తుల తాకిడి కనిపించింది.
దుర్గమ్మ దర్శనానికి
తరలివచ్చిన భక్తజనం


