మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త దశలవారీ ఆందోళన పోరాటంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మినెంట్ చేయాలని, పీస్ రేట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని.. జేఎల్ఎం కన్వర్షన్స్ అయిన కార్మికులందరికీ ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 2008 ముందు జాయిన్ ఉద్యోగులందరికీ ఈపీఎప్ హయ్యర్ పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని, సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరావు, జె.అనిల్కుమార్, ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.మోహనరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.


