సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు
మచిలీపట్నంటౌన్: జీవిత బీమా సంస్థలో రూ.10 వేల కోట్ల వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కోనేరు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్ఐసీని కాపాడాలని కోరుతూ ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఔషధ రంగానికి సంబంధించి ఐడీపీఎల్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ పరం చేయడంతో సామాన్యులకు ఔషధాల ధరలు అందనంత విధంగా పెరిగిపోయా యని ఆందో ళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మోదీ నిరంకుశ విధానాలకు తోడు రాష్ట్రంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో ముందు వరుసలో ఉంటున్నారని దుయ్యబట్టారు. సీఐటీయూ పోరాటం చేయకుంటే 2021లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోయేదని పేర్కొన్నారు. 1956లో రూ.5 కోట్ల మూల నిధితో ప్రారంభమైన ఎల్ఐసీ నేడు లక్షల కోట్ల సొంత ఆస్తులు కలిగే పరిస్థితికి ఎదిగిన కామధేనువు లాంటి సంస్థను వాటాల విక్రయం పేరుతో ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. ఐసీయూ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడు దేవనబోయిన వాసు, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.హెచ్.వి.ఎల్.రాధాకృష్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.పోలినాయుడు, కె.వి. గోపాల్రావు, ఆర్.సి.పి రెడ్డి, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. ధనశ్రీ, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగులు పి.నాగయ్య, సీహెచ్.రాజేష్, ఎస్. ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.


