ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు శనివారం రూ.3.16 లక్షల విలువైన బంగారు నక్లెస్ను కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.శ్రీధర్ కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చే సింది. రూ.3.16 లక్షలతో 21 గ్రాముల బంగారం, పచ్చరాళ్లు, కెంపులు, ముత్యాలుతో తయారు చేయించిన నక్లెస్ను అమ్మవారికి సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు.
ఉద్యోగోన్నతుల నియామక
పత్రాలు అందజేత
చిలకలపూడి(మచిలీపట్నం): పలువురు జిల్లా పరిషత్ ఉద్యోగులకు ఉద్యోగోన్నతి పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక శనివారం అందజేశారు. ఆమె కార్యాలయంలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, 26 మంది ఆఫీస్ సబార్డినేట్లకు రికార్డు, లైబ్రరీ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జెడ్పీ పరిధిలో వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు పది రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యోగోన్నతులు ఇచ్చారన్నారు. తమ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
నేడు జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టు ఎంపిక
మచిలీపట్నంఅర్బన్: ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ జట్టును ఎంపిక చేసేందుకు అధికారిక సెలెక్షన్ ట్రయల్స్ను ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటలకు పోరంకిలోని నిడమానూరు రోడ్డుపై ఉన్న అస్త్ర మెడికల్ అకాడమీ ప్రాంగణంలోని హంటింగ్ టైగర్స్ గ్రౌండ్లో జరుగుతాయని పేర్కొన్నారు. జనవరి 2011 నుంచి డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలురు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. హాజరయ్యే క్రీడాకారులు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫుట్బాల్ కిట్తో పాటు క్రీడా దుస్తులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు. ఆసక్తి, ఎంపికై న క్రీడా కారులు ఈ నెల 11 నుంచి 13 వరకు మదనపల్లిలో జరిగే రాష్ట్ర అంతర్ జిల్లా ఫుట్బాల్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు కోఆర్డినేటర్ కె.మణిబాబును 97032 85954 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
దాసాంజనేయ దేవాలయానికి రూ. 2.30 లక్షలు విరాళం
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం దాత ఆళ్ళ నాగ శ్రీనివాస్ మాలతి దంపతులు రూ. 2.30 లక్షలు విరాళాన్ని ఆలయ కార్య నిర్వహణాధికారి పాతూరి లోకేశ్వరికి అందజేశారు. దాత ఆళ్ళ నాగశ్రీనివాస్ మాట్లాడుతూ మహిమాన్వితమైన స్వామివారికి తన వంతు బాధ్యతగా తాను విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. మందిరం అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తొలుత దాత దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి శేషవస్త్రం చిత్రపటంతో దాతలను సత్కరించారు.


