● ఎరువులు బుక్ చేసేందుకు పనిచేయని సర్వర్ ● రైతులకు తప్పని రోజుల తరబడి నిరీక్షణ ● 48 గంటలపాటే చెల్లుతున్న క్యూఆర్ కోడ్ ● ఆ లోపు రైతులకు ఎరువులు అందని వైనం
పెడన: ‘సర్వర్ పనిచేయడం లేదు. లైన్లో వేచి ఉండండి.., సర్వర్ చాలా స్లోగా ఉంది. ఒకదాని తరువాత ఒకటి చేస్తున్నాం. వేచి ఉండండి..’ ఇవీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు వింటున్న మాటలు. ఈ పదాలు వినీవినీ రైతులు విసిగి పోతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కాకినాడ, కృష్ణా జిల్లాలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ యాప్కు వినియోగించాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. అయితే చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదు. దీంతో వీఏఏలు రైతుల వద్ద ఉన్న కీప్యాడ్ ఫోన్లుకు ఓటీపీ చెప్పి, క్యూ ఆర్ కోడ్ జనరేట్ చేసి ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉండి కూడా బుక్ చేసుకోలేని వారి వద్ద వివరాలను నమోదు చేసుకుని క్యూఆర్ కోడ్ ఫొటో తీసి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు రైతుకు ఎటువంటి ఇబ్బందీ ఉండటం లేదు. ఒక రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఇచ్చేస్తున్నారు. అసలు కష్టం రైతుకు యూరియా కట్ట తెచ్చుకోవడమే. రైతు సేవా కేంద్రాల నుంచి తెచ్చుకున్న స్లిప్, కార్డులను మన గ్రోమోర్ కంపెనీ వద్దకు లేదా ఎదైనా సొసైటీ వద్దకు రైతులు తీసుకెళ్తే అక్కడే రెండు, మూడు రోజులు సమయం పడుతోంది.
48 గంటలే క్యూఆర్ కోడ్ చెల్లుబాటు
రైతు యూరియా కోసం వీఏఏ క్యూఆర్ కోడ్ ఇచ్చిన 48 గంటల్లోపు రైతు యూరియా తీసుకోవాలి. సొసైటీలు వద్దకు, ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు క్యూలో ఉండాలని, సర్వర్ స్లోగా ఉందని, సర్వర్ పనిచేయడం లేదని, రేపు రావాలని చెబుతున్నారు. రైతులు మరుసటి రోజు వెళ్తే అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. 48 గంటలు దాటితే మళ్లీ క్యూఆర్ కోడ్ కోసం వీఏఏ వద్దకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.


