మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ వైద్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ఐవీఆర్ఎస్ ద్వారా సానుకూల ప్రజాభిప్రాయం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిరీక్షణ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షకుల నెలవారీ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ, గర్భిణులకు ముందస్తు ప్రసవ ప్రణాళిక (బర్త్ ప్లానింగ్)ను సమర్థంగా అమలు చేసి, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100శాతం లక్ష్యంతో విజయవంతంగా పూర్తి చేసిన వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అభినందించారు.


