గూడూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడూరులో మంగళవారం పర్యటించిన కలెక్టర్... క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు), ఎన్నికల విభాగం అధికారులతో కలిసి ఇంటింటి సర్వే తీరును పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డేటా డిజిటైజేషన్ పురోగతిపై ఆరా తీశారు. ఫారాల పంపిణీపై ఆరా తీశారు. నిర్ణీత గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ డీఆర్వో పి.పోతురాజు, గూడూరు తహసీల్దార్ డి.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో పి.శైలజ కుమారి, డిప్యూటీ ఎంపీడీవో చండిక ఉమామహేశ్వరరావు, బీఎల్వోలు పాల్గొన్నారు.
పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఒడిశా గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్గొని ప్రారంభోత్సవం చేస్తారని స్థానికుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మంగళవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కనుమూరులో ఆర్టీసీ బస్సు వయా ముళ్లపూడి, అయినంపూడి, కూచిపూడి వరకు వెళ్లే విధంగా బస్ ప్రారంభం ఉంటుందని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.


