శృతిభారతి వేద పాఠశాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

శృతిభారతి వేద పాఠశాల ప్రారంభం

Jun 27 2026 1:19 AM | Updated on Jun 27 2026 1:19 AM

తాడేపల్లి(ఘంటసాల): ఘంటసాల మండలం తాడేపల్లిలోని శ్రీమలయాళ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శృతిభారతి వేద పాఠశాలను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌, ఏర్పేడుకు చెందిన శ్రీవ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి, తిరుపతికి చెందిన జాతీయ సంస్కృత విశ్వ విద్యాయలం కులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామకృష్ణమూర్తిలతో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ కేరళ నుంచి వచ్చిన మలయాళ స్వామి ఈ ప్రాంతంలో భక్తి, ధ్యానం, సేవే ధ్యేయాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగు కవి, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగశాస్త్రి, ఎన్నారై మూల్పూరి ఫౌండేషన్‌ అధినేతలు మూల్పూరి వెంకటరావు – సావిత్రి దంపతులు, అధ్యాత్మిక గురువు శ్రీవిజ్ఞాన స్వరూప్‌, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగు సహస్రావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

5న కృష్ణవేణి కవితోత్సవం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): తెలుగు భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని పెంపొందింపజేయాలనే సంకల్పంతో జూలై 5వ తేదీన సవ్యసాచి గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త నిర్వహణలో 169వ అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనాన్ని ‘కృష్ణవేణి కవితోత్సవం’ పేరుతో నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక ఎన్టీఆర్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు, నిర్వహణ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ కేఆర్‌జీ శేషుకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్టర్‌ అయిన వారిలో ఎంపిక చేసిన సుమారు 250 మంది తెలుగు కవులు ద్విశతాధిక కవిసమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో తెలుగు భాషా సాహిత్యాలకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ప్రముఖులను ‘అక్షర రత్న’ పురస్కారాలతో ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

యాప్‌తో ఎరువుల విక్రయంలో ఇబ్బందులు

మచిలీపట్నంటౌన్‌: రైతులకు యాప్‌ ద్వారా ఎరువుల విక్రయాలకు వ్యతిరేకంగా రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), సచివాలయాలు, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్ణయించింది. మచిలీపట్నంలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏపీ రైతు, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.శివనాగేంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ రైతు సంఘం సీనియర్‌ నేత వై.కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకు వచ్చిన యాప్‌ ద్వారా ఎరువుల కొనుగోలు విధానంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్రనాధ్‌ బెనర్జీ మాట్లాడుతూ యాప్‌ విధానంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సంఘం ఆధ్వర్యాన ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జగన్‌, పి.జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement