
లేబర్ కోడ్ల విధానం రద్దుకు డిమాండ్
మచిలీపట్నంటౌన్: భారతదేశ కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కట్టు బానిసలు చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా, వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలనే పిలుపులో భాగంగా కార్మిక, కర్షక ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు వేతనం అమలు చేయాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని, పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కృష్ణాజిల్లాలో కూడా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు లింగం ఫిలిప్, పోస్టల్ ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యదర్శి కేవీ రావు, ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి, మచిలీపట్నం రిసోర్స్ పర్సన్స్ మెప్మా ఆర్పీల సంఘం జిల్లా నాయకులు కె. మాధవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు ప్రసంగించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.