
‘సాక్షి’ కార్యాలయంపై దాడికి ఖండన
చిలకలపూడి(మచిలీపట్నం): ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీని బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను పత్రికలో ప్రచురించినందుకు కోపోద్రిక్తుడై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ఏలూరు ‘సాక్షి’కార్యాలయంపై దాడి చేయడం అమానుషమైన చర్య అన్నారు. ఎమ్మెల్యేతోపాటు 100మందికి పైగా అనుచరులు అక్కడ ఉన్న పాత్రికేయులపై దాడికి యత్నించడంతోపాటు కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల చర్య పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ప్రజల సమస్యలకు అక్షరరూపం ఇస్తే అధికారమదంతో ఇలా దాడులకు పాల్పడటం తగదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ బాధితులను బెదిరింపులకు గురిచేయటం వాస్తవం కాకుంటే వారితో మాట్లాడుకోవాలే తప్ప జరిగిన సంఘటనను తెలియజేసిన పత్రికలపై అక్కసుతో ఈ విధంగా చేయడం భావ్యం కాదని హితవు పలికారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీకి విజ్ఞప్తి చేశారు.
నిందితులను శిక్షించాలని కలెక్టర్కు వినతి