
ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన యూకోబ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కోట్ల వ్యాపారం చేసిందని ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాతబస్తీ బ్రాహ్మణవీధిలో ఏర్పాటు చేసిన ఆబ్యాంక్ విజయవాడ వన్టౌన్ శాఖ నూతన ప్రాంగణాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్విట్ ఇండియా సమయంలో గాంధీజీ పిలుపు మేరకు దేశంలోని వ్యాపారవర్గాల కోసం జీడీ బిర్లా 1943లో యూకోబ్యాంకును స్థాపించారన్నారు. నాటినుంచి దేశంతోపాటు హంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లోనూ మూడువేలకు పైగా శాఖలతో సేవలందిస్తున్నట్లు వివరించారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశాభ్యున్నతికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు గృహ, వాహన రుణాలను గంటల్లోనే మంజూరు చేస్తున్నామన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తమ బ్యాంక్ యాప్నకు టాప్ ర్యాంకింగ్ ఉందన్నారు. జోనల్లో ప్రస్తుతం 91శాఖలు ఉన్నాయని, మరో ఐదు శాఖలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. వన్టౌన్శాఖ మేనేజర్ యు. శ్రీనివాస్ మాట్లాడుతూ వన్టౌన్లో తమబ్యాంక్ 48 ఏళ్లుగా సేవలందిస్తున్నట్లు వివరించారు.
యూకోబ్యాంక్ డీజీఎం శ్రీకాంత్