జిల్లాలో మొదలైన పామాయిల్ దిగుబడి స్థిరమైన ఆదాయం వైపు రైతుల అడుగులు 1,680 ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం
రెబ్బెన: పడిపోతున్న దిగుబడులు, అస్థిరమైన మార్కెట్ ధరలతో సతమతమవుతున్న రైతులకు ఆయిల్పామ్ సాగు నూతన ఆశాకిరణంగా నిలు స్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమతో 30 ఏళ్ల పాటు నెలకు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఈ పంట సాగు వైపు జిల్లా రైతాంగం అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కేవలం వరి, పత్తి పంటలకే పరిమితమైన చేలల్లో ఇప్పుడు ఆయిల్పామ్ మొక్కలు పచ్చగా ఎదుగుతున్నాయి. జిల్లాలో ఐదేళ్ల క్రితం సాగు ప్రారంభం కాగా దిగుబడులు మొదలై అన్నదాతలకు ఆదాయం అందిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా నుంచి 1,250 టన్నుల ఆయిల్పామ్ దిగుబడులను రైతులు విక్రయించారు. ప్రస్తుతం ఒక ఎకరం తోటలో రెండు టన్నుల వరకు దిగుబడి వస్తోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే చెట్లు ఐదారేళ్లకు చేరేసరికి ఎకరానికి 6 నుంచి 8 టన్నుల దిగుబడి అందిస్తా యి. ఎనిమిదో ఏటా నుంచి గరిష్టంగా 12 టన్నుల వరకు దిగుబడి రావచ్చు. అయితే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్పామ్కు రూ.24 వేల ధర పలుకుతోంది. 3 నుంచి 4 ఏళ్లలో కాపు ప్రారంభమై సుమారు 25 నుంచి 30 సంవత్సరాలపాటు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూనే ఉంటుంది.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఏటా జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతున్నా అధికారులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కొంతమంది రైతులకు అపోహలు ఉండటం, సరైన నీటి వసతులు లేకపోవడం వంటివి కారణాలతో ముందుకు రావడం లేదు. ఐదేళ్ల క్రితం 53 ఎకరాలతో మొదలైన సాగు ప్రస్తు తం 1,680 ఎకరాలకు పెరిగింది. 2026– 27 ఆర్థిక సంవత్సరంలో 1,000 ఎకరాల లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే 666 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను సైతం గుర్తించారు. జిల్లాలో ముందుగా సాగు చేసిన రైతులకు దిగుబడి మొదలై ఆదాయం సైతం వస్తుండటంతో మిగిలిన వారు ఆకర్షితులవుతున్నారు. రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
మార్కెటింగ్ భద్రత
ఆయిల్పామ్ పంటలో వచ్చే దిగుబడిని అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు ఉండవు. దిగుబడి రాగానే ప్రాసెసింగ్ కంపెనీలే మద్దతు ధరతో నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నాయి. జిల్లాలో వచ్చే దిగుబడిని ప్రస్తుతం సిద్దిపేటకు తరలిస్తున్నా రు. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ రైతుల వద్ద నుంచి దిగుబడులను కొనుగోలు చేసి తరలి స్తోంది. మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు లే కుండానే మద్దతు ధర పొందుతున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లోకే నగదు బది లీ అవుతోంది.


