కౌటాల: దొంగలు రూటు మారుస్తున్నారు. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను అడ్డాలుగా మార్చుకుని చోరీలకు పాల్పడేవారు. ప్రస్తుతం బంగారమే వారి ప్రధాన లక్ష్యంగా మారింది. గోల్డ్ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు లాక్కెళ్తున్నారు. ఏటా జిల్లాలో వందకు పైగా దొంగతనాల కేసులు నమోదవుతుండగా, రూ.కోట్ల విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. 2024లో 50 దొంగతనాలు జరగ్గా, 2025లో వాటి సంఖ్య 151కు పెరిగినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఒంటరి మహిళలే లక్ష్యం..
గోల్డ్ ధరలు భారీగా పెరుగుతుండటంతో నేరగాళ్ల దృష్టి బంగారంపై పడింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారు. ఒంటరిగా నడుస్తున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ తక్కువగా ఉన్న రహదారులపై ఆభరణాలు అపహరిస్తున్నారు. ముఖాలకు మాస్కులు, హెల్మెట్లు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. బైక్లపై వేగంగా వచ్చి మెడలోని గొలుసు లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి బయటపడుతున్నారు. దుండగులు బలంగా లాగుతుండటంతో కొన్ని సందర్భాల్లో బాధితులు తీవ్రంగా గాయపడుతున్నారు.
జిల్లాలో కొన్ని ఘటనలు
శనివారమే అక్కడ చోరీలు
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వారసంత జరిగే శనివారమే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఈ నెల 11న కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామానికి చెందిన ఎల్ములే అంజనాబాయి బస్టాండ్లో కౌటాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు చైన్ అపహరించారు. బాధితురాలు సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. కాగా, అదేరోజు నాలుగు ఫోన్లు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వారాంతపు సంతలో పార్కింగ్ చేసిన రెండు బైక్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు వారాంతపు సంత రోజు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ మండలాల్లోనూ చోరీలు పెరిగాయి. సగం మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. ఫలితంగా మహారాష్ట్ర నుంచి కౌటాల, బెజ్జూర్, వాంకిడి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కాగజ్నగర్, రెబ్బెన మండలాలకు నిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీంతో చోరీలకు పాల్పడిన వారు రైల్వే మార్గాలను వినియోగించుకుంటూ పొరుగు రాష్ట్రం వైపునకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి, సొమ్ము రికవరీలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చిక్కకుండా సరిహద్దు దాటుతూ..


