ఆసిఫాబాద్అర్బన్: వేధింపులు, హింస, లైంగిక దాడులు, గృహ హింస వంటి కేసుల్లో బాధితులకు భరోసా కేంద్రం ఒక సహాయక వేదికగా పనిచేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను మంగళవారం తనిఖీ చేశారు. నమోదైన కేసులు, కౌన్సెలింగ్ సేవలు, బాధితులకు సహాయ చర్యలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి ఎస్సై దివ్యతోపాటు సిబ్బందికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతీ కేసులో సున్నితంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులు, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి అవసరైమన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.


