ఆసిఫాబాద్రూరల్: ఈ నెల 21న నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హై దరాబాద్ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కిషోర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్యదేవరాజన్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం పటిష్ట బందోబస్తు మధ్య, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ స్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి మండలానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులలో స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఎస్పీ నితికా పంత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


