ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో నిందితులకు శిక్షపడేలా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ కాస్తూ డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. అనంతరం అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


