కాగజ్నగర్టౌన్: పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. పట్టణంలోని రాజీవ్గాంధీ చౌర స్తా, తిరందాజ్ టాకీస్ వరకు గల రోడ్డును గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాలువలు శుభ్రపర్చాలని, తడిపొడి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గురుకృప టిఫిన్ నిర్వాహకులు వినియోగించిన ప్లేట్లను రోడ్డుపై పడివేయగా, యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను చెత్తకుండీల్లో వేయాలని సూచించారు. వీరి వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, సిబ్బంది ఉన్నారు.
అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు
అనుమతులు లేకుండా ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కాగజ్నగర్ మండలంలోని గన్నారం, మండువ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల్లోని చెరువులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను నజ్రుల్నగర్ విలేజ్ నం.12 సమీపంలో అడ్డుకున్నారు. అనుమతులు, సరైన పత్రాలు లేకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మధుకర్, సిబ్బంది ఉన్నారు.
పకడ్బందీగా ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ
ఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు బూత్స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించి ధ్రువపత్రాలు జత చేసిన ఫారాన్ని తిరిగి తీసుకుని బీఎల్వో యాప్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 358 పోలింగ్ కేంద్రాల్లో హేతుబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జమీల్, డీటీలు శ్యాంలాల్, రామ్లాల్, సిబ్బంది పాల్గొన్నారు.


