రెబ్బెన: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాకే కుమురంభీం పోరుగడ్డకు సీఎం రేవంత్రెడ్డి రావాలని బీజేపీ ఆత్మ నిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. గోలేటిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500, యువతకు రూ.4వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల పెంపు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ వంటి అనేక హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీలు అమలు చేసి రెబ్బెన గడ్డపై అడుగు పెట్టాలని హితవు పలికారు. జిల్లా కార్యదర్శి నవీన్గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఇస్తారీ తదితరులు పాల్గొన్నారు.


