కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరిధాన్యం కుప్పలు తూకం పూర్తయినా మిల్లులకు తరలింపులో జాప్యం బస్తాలు, కుప్పల వద్ద రైతుల పడిగాపులు అన్నదాతలను భయపెడుతున్న అకాల వర్షాలు
దహెగాం: చెమట చిందించి పంట పండించడం కంటే దానిని అమ్ముకోవడం అన్నదాతకు తలకు మించిన భారంగా మారింది. కొనుగోలు కేంద్రాలతో వారి కష్టాలు తీరకపోగా, ధాన్యం కుప్పల వద్ద బ తుకులు రోడ్డున పడ్డాయి. యాసంగి వరికోతలు పూర్తయి నెలరోజులు దాటుతున్నా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు వేగం పుంజుకోవడం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారా పట్టి అమ్మకానికి సిద్ధం చేసినా కాంటాలు వేయడంలో అధికారులు తాత్సారం చే స్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తిచేసి బస్తాల్లో నింపినా వాటిని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తగినన్ని లారీలు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలు సైతం పది, ఇరవై రోజులు గా కేంద్రాల్లో మూలుగుతున్నాయి. వానాకాలం సాగుకు సమయం ఆసన్నమవుతుండగా, అకాల వర్షాల భయం అన్నదాతలను వెంటాడుతోంది.
అన్లోడింగ్లో జాప్యం
జిల్లా వ్యాప్తంగా సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, రెబ్బెన, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్నగర్ మండలాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం అన్లోడింగ్కు జిల్లాలో నాలుగు మిల్లులు మాత్రమే కేటాయించారు. మిల్లులకు తరలించిన ధాన్యం అన్లోడింగ్లో జాప్యంతో కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోతుంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 6,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో దొడ్డురకం ధాన్యం 5,435 మెట్రిక్ టన్నులు, సన్నరకం 622 టన్నులు సేకరించారు. కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం లేదు. తూకమైనా బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. మిల్లుకు వెళ్లిన లారీ అన్లోడ్ కావడానికి రెండు రోజులు పడుతుందని తెలుస్తోంది.


