కంట్రోల్ రూం నంబర్ 08733–293713
● నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ● హాజరు కానున్న 10,301 మంది విద్యార్థులు
ఆల్ ది బెస్ట్
ఆసిఫాబాద్రూరల్/కౌటాల: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు మొత్తం 48 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 10,301 మంది విద్యార్థులు 19 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, బెంచీలు, ప్రతీ కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచనున్నారు. భద్రత కోసం కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ప్రత్యేక నిఘా కోసం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల సంచులను తెరుస్తారు. అదే రీతిలో జవాబు పత్రాలను సీల్ చేస్తారు. మాస్ కాపీయింగ్కు తావుతేకుండా ప్రతీ కేంద్రానికి సీఎస్, డీవో ఉంటారు. పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఇద్దరు సభ్యులతో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో పరిశీలకుడిని నియమించారు. అలాగే జిల్లా పరీక్ష కమిటీ, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు సైతం తనిఖీ చేపడుతారు.
ఐదు నిమిషాల వరకు అనుమతి
విద్యార్థులు తప్పకుండా ఉదయం 8.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిస్తారు. ప్రైవేట్ కళాశాలల నుంచి వేధింపులను అరికట్టేందుకు వెబ్సెట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా అనుమతించాలని అధికారులు ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. అధికారులు, విద్యార్థులు సెల్ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించారు. విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రభుత్వం టెలీమానస్ 14416 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాస్థాయిలో సందేహాలను నివృత్తి చేసేందుకు డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం 08733–293713 నంబర్ను ఏర్పాటు చేశారు.
పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీఐఈవో రాందాస్, డీటీవో రాంచందర్, డీపీవో భిక్షపతి, ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


