నగదు రహిత వైద్యం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం సంఘం నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నేటివరకు అమలు చేయడం లేదన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, డే వాయిదాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు రూపొందించి, డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. టీచర్లకు టెట్ మినహాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులు తగ్గించి, ఇన్సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి, ప్రధాన కార్యదర్శి ఊశన్న, ఉపాధ్యక్షుడు ఇందురావు, కోశాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


