మరుగుదొడ్లు మరిచిపోయారు..!
వాష్రూంలు లేకుండానే ‘సంఘ బంధం’ భవన నిర్మాణాలు మహిళా సంఘాల సభ్యుల అసంతృప్తి ప్లానింగ్ మార్చాలని డిమాండ్
కెరమెరి: గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి ‘సంఘం బంధం’ పేరిట నిర్మిస్తున్న భవనాల్లో ప్రభుత్వం కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది మహిళలు సమావేశమయ్యే చోట వాష్రూంలు లేకపోతే ఎలా అని స్వయం సహాయక సంఘాల సభ్యులు నిలదీస్తున్నారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనాల ప్లాన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
222 భవనాలు మంజూరు
జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 386 వీవో సంఘాలు ఉండగా, అందులో 222 వీవోలకు భవనాలు మంజూరయ్యాయి. ఇందుకోసం గ్రామాల్లో దాతల స్థలాలు, ప్రభుత్వ స్థలాలను సేకరించి ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల వ్యయంతో నిర్మించేలా పనులు ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నా భవన నమూనాలో మరుగుదొడ్లను చేర్చకపోవడంపై పెదవి విరుస్తున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా బహిరంగ మల, మూత్ర విసర్జనను అరికట్టి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు మహిళల కోసమే నిర్మిస్తున్న ’సంఘం బంధం’ భవనాల్లో వాష్రూంలు లేకపోవడం విడ్డూరంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి సమావేశాల్లో పాల్గొనే వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
200 గజాల స్థలంలో నిర్మాణం
సంఘం బంధం భవనాలు 200 గజాల స్థలంలో ని ర్మిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల వె చ్చిస్తున్నారు. ఈ అంచనా వ్యయం మొత్తాన్నీ కేవలం భవన నిర్మాణానికే కేటాయించారు. వాష్ రూంలను మాత్రం విస్మరించారు. సాధారణంగా సమావేశాలకు హాజరయ్యే మహిళలు గంటల తరబడి ఒకేచోట ఉంటారు. మూత్ర విసర్జన కోసం ఎక్కడి కి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, ఐకేపీ అధికారులు వారు క్షేత్రస్థాయిలో భవన నమూనాను పరిశీలించి ప్లాన్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆందోళన వద్దు
మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమే. కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
– దత్తారావు, డీఆర్డీవో


