
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు
ఉన్నత పాఠశాలలు 60
ప్రాథమికోన్నత 101
ప్రాథమిక 561
కేజీబీవీలు 15
యూఆర్ఎస్ 1
మోడల్ స్కూల్స్ 2
కెరమెరి(ఆసిఫాబాద్): పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన పెంపొందించడంతోపాటు పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో పర్యావరణ క్లబ్(ఎకో క్లబ్) అను ఏర్పాటు చేయగా ఈ విద్యాసంవత్సరం నుంచి వాటిని ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్గా పిలువనున్నారు. అన్ని పాఠశాలల్లో కొత్త క్లబ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులతో కమిటీ..
ఈ నెల 16 నుంచి 29 జూలై వరకు అన్ని పాఠశాలల్లో క్లబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసి క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు థీమ్లకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు https:// merilife. nic. in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఏకో క్లబ్లు ఏర్పాటు అనంతరం ఈ కార్యక్రమం ఏడాదంతా కొనసాగనుంది. జిల్లాలోని 740 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఏడు ఇతివృత్తాలపై క్లబ్లు
ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు ఇతివృత్తాలను ఎకో క్లబ్ల్లో ఈ ఏడాది భాగస్వామ్యం చేశారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శక్తిని ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పడం, స్థిరమైన ఆహార వ్యవస్థలు ఉపయోగించడం, వ్యర్థాలు తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ఈ– వ్యర్థాలను తగ్గించడం వంటి అంశాలను ప్రచారం చేయనున్నారు.
ఈ ఏడాది నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పేరు మార్పు
నేటి నుంచి జూలై 29 వరకు ఏర్పాటుకు అవకాశం
విద్యార్థులకు పచ్చదనం పెంపు, మొక్కల రక్షణపై అవగాహన
అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా అన్ని పాఠశాల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలి. కేటాయించిన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగించాలి. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్టినేనర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు