
సాగు సందడి
ఆసిఫాబాద్అర్బన్: ఈ ఏడాది నైరుతి ముందుగానే పలకరించింది. వేసవిలోనే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు.. మోస్తరు వర్షాలు పడుతుండటంతో పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారు. మిగిలిన వారు కూడా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా సాగు సందడి కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాల రాకతో పత్తి విత్తనాలు విత్తుకోవడం జోరందుకుంది. ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోయినా.. రైతులు కోటి ఆశలతో సాగు పనులు చేస్తున్నారు.
నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో..
జిల్లాలో ప్రస్తుత వానాకాలంలో 4.45 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది 3.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు ఉండగా, ఈ ఏడాది మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల నుంచే అంటే.. మే మూడోవారంలోనే పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించారు. ఇంకా విస్తారంగా వర్షాలు పడని నేపథ్యంలో కొందరు మాత్రం తర్జనభర్జన పడుతున్నారు. మరిన్ని వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని చూస్తున్నారు. నల్లరేగడి భూములు తేమను నిలుపుకునే అవకాశం ఉండటంతో పత్తి విత్తనాలు విత్తుకునే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈసారి పత్తికి మద్దతు ధర రూ.8,11గా ప్రకటించింది. ఇందులో సాధారణ రకం పింజాకు రూ.7,710, పొడవాటి పత్తి పింజాకు రూ.8,110 చెల్లించనున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.580 వరకు పెరిగిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు.
విత్తడం ప్రారంభించాం
వర్షాలు పడుతుండటంతో పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించాం. ఇదివరకే కురిసిన వర్షాలకు భూమిలో తేమ ఉంది. వర్షాలు కురిసిన సమయంలో విత్తనాలు వేస్తే మొలకశాతం బాగుంటుంది. లేకుంటే భూమిలోనే మాడిపోయే అవకాశం ఉంది.
– నాందేవ్, దస్నాపూర్
అధికారుల సలహాలు తీసుకోవాలి
రుతుపవనాలు రావడంతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఈ విధంగా అనుకూలంగా ఉంటే పత్తి విత్తనాలు వేసుకోవచ్చు. రైతులకు అవసరమయ్యే యూరియా అందుబాటులో ఉంచుతాం. ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
పత్తి విత్తనాలు విత్తుకుంటున్న రైతులు
ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం

సాగు సందడి