బోనస్‌ వచ్చేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ వచ్చేదెప్పుడో?

Jun 17 2025 5:01 AM | Updated on Jun 17 2025 5:01 AM

బోనస్

బోనస్‌ వచ్చేదెప్పుడో?

హెగాం మండల కేంద్రానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి యాసంగి సీజన్‌లో పదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 160 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం విక్రయించాడు. ధాన్యం విక్రయించిన డబ్బులతోపాటు బోనస్‌ కూడా ఇంతవరకు అందలేదు. కేవలం బోనస్‌ నగదే రూ.80వేలు రావాల్సి ఉంది. రుతుపవనాల రాకతో వానాకాలం సాగు పనులు ప్రారంభించాడు. పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం త్వరగా నగదు ఖాతాల్లో జమ చేయాలని వేడుకుంటున్నాడు. ఒక్క భాస్కర్‌రెడ్డి మాత్రమే కాదు.. జిల్లావ్యాప్తంగా సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

దహెగాం(సిర్పూర్‌): సన్నరకం వరి సాగుచేసిన వారికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలతో సన్నాల సాగుకు మొగ్గు చూపారు. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి రోజులు గడుస్తున్నా బోనస్‌ నగదు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను గత నెలలోనే మూసివేశారు. బోనస్‌ డబ్బులు పడ్డాయా.. లేదా అంటూ బ్యాంకులు, సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించినా పంట బోనస్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

24 వేల ఎకరాల్లో సాగు..

జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో సుమారు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో సన్నాల సాగు గణనీ యంగా పెరిగింది. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఈ ఏడాది 56 వేల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కేవలం 13 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో అనుకున్న లక్ష్యం చేరలేదు. సన్నరకం ధాన్యం 5,800 మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. సొసైటీల ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,320 ధర చెల్లించింది. ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిబంధనలు కఠినంగా ఉండడంతో కొందరు రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం కారణంగా అకాల వర్షాలతో కొంత ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు.

నెలరోజులైనా ఊసే లేదు..

నగదు జమ చేయడంలో తీవ్ర జాప్యం

జిల్లాలో రూ.2.80 కోట్లు పెండింగ్‌

ఆందోళనలో అన్నదాతలు

12,090 మంది అర్హులు..

జిల్లాలో అధికంగా సిర్పూర్‌(టి) నియోజకవర్గంలో వరిసాగు ఉంది.. యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని రైతులు ఎక్కువగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకున్నారు. జిల్లాలో 12,090 మంది బోనస్‌కు అర్హులుగా గుర్తించగా, వారికి రూ.2.80 కోట్ల నగదు అందించాల్సి ఉంది. నెల రోజులైనా బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో డబ్బులు వస్తాయా..? రావా..? అనే ఆందోళన నెలకొంది. పెట్టుబడికి ఉపయోగించుకుందామని చాలామంది ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను మూసివేసి నెలరోజులు కావొస్తున్నా నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికై నా బోనస్‌ నగదు విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో వినోద్‌ను ‘సాక్షి’ పలుమార్లు ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

త్వరగా విడుదల చేయాలి

సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందిస్తామని గత ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగి సీజన్‌లో కూడా సన్నాలు సాగు చేసినం. 25 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వడ్లు విక్రయించి నెలరోజులు దాటింది. అయినా బోనస్‌ డబ్బులు ఇంకా విడుదల చేయలేదు. బోనస్‌ కోసం ఎదురు చూస్తున్నాం.

– వెన్నంపల్లి పెంటయ్య, రైతు, దహెగాం

బోనస్‌ వచ్చేదెప్పుడో?1
1/2

బోనస్‌ వచ్చేదెప్పుడో?

బోనస్‌ వచ్చేదెప్పుడో?2
2/2

బోనస్‌ వచ్చేదెప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement