రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 విరమించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 విరమించుకోవాలి

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 విరమించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 విరమించుకోవాలి

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కాగజనగర్‌టౌన్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ను టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49ను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 49తో జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటించడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. జీవోపై ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా గిరిజన మంత్రి సీతక్క స్పందించకపోవడం అన్యాయమన్నారు. జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రి నిజామాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకులు స్పందించకపోవడం వారి డొల్లతనానికి నిదర్శనమని మండిపడ్డారు. జీవో నం.49కు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, అఖిల పక్షాలతో జేఏసీగా ఏర్పడి దశలవారీగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు జీవో రద్దుపై వినతిపత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం జీవో ప్రతులను బీజేపీ నాయకులతో కలిసి దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్‌, మండల అధ్యక్షుడు పుల్ల అశోక్‌, నాయకులు గణపతి, తిరుపతి, గజ్జల లక్ష్మణ్‌, తిరుపతిగౌడ్‌, మహేశ్‌, చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement