
గోదావరిలో మృత్యు ఘోష
● నీట మునిగి ఐదుగురు మృతి ● మృతులంతా 22 ఏళ్లలోపు వారే ● నిర్మల్ జిల్లా బాసర వద్ద ఘటన ● మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు ● మిన్నంటిన తల్లిదండ్రుల రోదన ● ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం
భైంసా/భైంసాటౌన్/బాసర: బాసర గోదావరి నది ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన యువకులను పరలోకాలకు పంపింది. వివరాలు.. హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్కు చెందిన వ్యాపారి ప్రేమ్రాంకు భరత్ (16), మదన్ (18), రాకేశ్ (20) ముగ్గురు సంతానం. వీరిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. ప్రేమ్రాం తన మరదలి కొడుకై న వినోద్ (19)కు హైదరాబాద్లోనే ఎస్సార్ నగర్లో నీట్ కోచింగ్ ఇప్పించాడు. విద్యాసంవత్సరం ఆరంభంలో ప్రేమ్రాం ఎప్పటిలాగే తన భార్య సోనుతో ముగ్గురు కొడుకులతోపాటు మరదలి కొడుకై న వినోద్, బంధువుల కుమారుడు రుతిక్(22)ను ఆదివారం రైలులో సరస్వతీ అమ్మవారి దర్శనానికి బాసరకు పంపించాడు. బాసరకు చేరుకున్న వీరు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలాచరించేందుకు వెళ్లారు. స్నాన ఘట్టాల వద్ద నీరు మురికిగా ఉందని గోదావరినది మధ్యలో తేలిన ఇసుక తిన్నెల వద్ద స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి బోటులో వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లోతు తెలియక ప్రేమ్రాం–సోను దంపతుల ముగ్గురు కొడుకులతో పాటు మరదలి కుమారుడు వినోద్, మరో యువకుడు రుతిక్ నీట మునిగి విగతజీవులయ్యారు. వీరి మృతదేహాలను భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రేమ్రాం–సోను కుమారుల మృతదేహాలతోపాటు వినోద్ మృతదేహాన్ని రాజస్థాన్కు పంపించారు. బంధువుల కుమారుడైన రుతిక్ మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాసర ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
జవాబు లేని ప్రశ్నలు
ఆదివారం బాసర గోదావరిలో యువకులను పోగొట్టుకున్న కుటుంబీకులు ఆవేదనతో అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. నీటిలో మునుగుతున్న తమ పిల్లలను కాపాడాలని ప్రాధేయపడ్డా ఎవరూ దగ్గరికి రాలేదని వాపోయారు. నది నీటిలో మునిగి కొన ఊపిరితో ఉన్న తమ పి ల్లలను కాపాడాలని అరిచినా గోదావరి పరిసరాల్లో ఓ వైద్యుడు, సిబ్బంది కనిపించలేదన్నారు. సీపీఆర్ చేసినా, అత్యవసర వైద్య సేవలు అక్కడే అంది ఉంటే పిల్లలు బతికేవారని బాధిత కుటుంబీకులు వాపోయారు. నీటి లోతు తెలిపే హెచ్చరించే బోర్డులు కూడా ఎక్కడా లేవని, అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చినా సరైన సేవలు అందలేదని ఆరోపించారు. ఇలా బాధిత కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రిలో మీడియా ఎదుట అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి.
వరుస ఘటనలతో..
బాసరలో ఇటీవలి కాలంలో ఇలాంటి వరుస ఘట నలు జరుగుతున్నా పట్టింపు కరువైంది. మే 26న మహారాష్ట్ర నుంచి వచ్చిన కులదీప్బాబాసాహెబ్ అనే బాలుడు, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్కు చెందిన యువకుడు బొల్లమల రాజు పుణ్యస్నానాల కోసం గోదావరిలోకి దిగి నీట మునిగి ఇదే ప్రాంతంలో మృతి చెందారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతిచెందినా రక్షణ చర్యలు కరువయ్యాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. లోతు, బురద ప్రాంతాల్లోనూ బోట్లు తిప్పుతున్నా నియంత్రించడంలేదు. స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే భక్తులు అవగాహన లేకుండా గోదావరిలోని లోతైన ప్రాంతాలకు స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల రక్షణ చర్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
తల్లడిల్లిన తల్లి హృదయం
తన ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి సోను కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ స్పత్రిలో కొడుకుల మృతదేహాలపై రోదించి న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ముగ్గురు కొడుకులను కోల్పోయిన తాను ఇక బతికుండలేనని గుండెలవిసేలా రోదించింది. ఏదైనా వాహనం కిందపడి చనిపోతా నని బయటకు పరుగెత్తింది. సమీప బంధువులు ఓదార్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు.
ఫాదర్స్ డే రోజునే ఘటన
ఫాదర్స్ డే రోజే ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని చెప్పి రైలెక్కిన ముగ్గురు కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని ప్రేమ్రాం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన కొడుకులతోపాటు మరదలి కొడుకు, బంధువుల కుమారుడి మృతి వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి భైంసా ఏరియాస్పత్రికి చేరుకున్నాడు. విగతజీవులైన కొడుకులను చూసి బోరున విలపించాడు.

గోదావరిలో మృత్యు ఘోష

గోదావరిలో మృత్యు ఘోష

గోదావరిలో మృత్యు ఘోష