
విత్తన యంత్రం వచ్చేసింది..!
కెరమెరి(ఆసిఫాబాద్): విత్తనాలు విత్తేందుకు అధిక సంఖ్యలో కూలీలు అవసరం పడుతుండటంతో రైతులపై భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా అతి చౌకగా విత్తనాలు విత్తే యంత్రం సీడ్ సోయింగ్ వీడర్ అందుబాటులోకి వచ్చింది. కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన సేంద్రియ రైతు కేంద్రె బాలజీ ఈ యంత్రంతోనే మొక్కజొన్న, పత్తి విత్తనాలు నాటాడు. యంత్రం ఖరీదు రూ.5.500. దీనికి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. యంత్రంలోని రెండు డబ్బాల్లో విత్తనాలు, ఎరువులు వేస్తే.. ఒకే వ్యక్తి సొంతంగా నడుపుతూ విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేయొచ్చు.
రైతులకు లాభం..
సాధారణంగా రెండెకరాల్లో పత్తి విత్తనాలు, ఎరువులు వేయాలంటే రోజుకు పది మంది కూలీలు అవసరం పడతారు. ఒక్కొక్కరికి రూ.500 చెల్లిస్తే పది మందికి రూ.5,000 అవుతుంది. కానీ సీడ్ సోయింగ్ వీడర్తో ఒకే కూలీ రోజులో రెండెకరాల్లో రెండు బ్యాగుల విత్తనాలు నాటొచ్చు. ఈ యంత్రంలో అన్ని రకాల విత్తనాలను నాటేందుకు కంపెనీ ఎనిమిది గేర్లతో అందుబాటులోకి తెచ్చింది.