బౌద్ధక్షేత్రం అభివృద్ధి పనులు
ఆర్ఆండ్బీకి అప్పగింత
నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో పనులను రోడ్డు భవనాల శాఖకు అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం బౌద్ధక్షేత్రాన్ని జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ ఆధారంగా చేయాల్సిన పనులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. నెలలోగా పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్అండ్బీ డీఈఈ భగవాన్, జేఈ పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.
టెన్సింగ్ నార్కే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం రాపర్తినగర్: సాహసకృత్యాలు ప్రదర్శించిన వారికి కేంద్రప్రభుత్వం ఇచ్చే టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. గత మూడేళ్లలో ఽధైర్య సాహసాలతో సాహసకృత్యాలు (నేల, నింగి, నీరు) ప్రదర్శించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఈమేరకు పూర్తి వివరాలో ఆగస్టు 21వ తేదీలోగా https// awards. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా పంచాయతీ అధికారిగా వినోద్
ఖమ్మం సహకారనగర్: జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా గొండుళ్ల వినోద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తొలుత ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్., అదనపు కలెక్టర్ శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన వినోద్కు డీఎల్పీఓలు రాంబాబు, విజయలక్ష్మి, డీపీఓ కార్యాలయం ఉద్యోగులు రాజేశ్వర్, ఉష, ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల రవీంద్రప్రసాద్తో పాటు జీ.వీ.సత్యనారాయణ, వీరస్వామి, ఉపేంద్రయ్య, సురేష్, హన్మంతరావు, కృష్ణ, మీరా శుభాకాంక్షలు తెలిపారు.


