అర్హులందరికీ ఓటు హక్కు
● ఎస్ఐఆర్పై అపోహలు వీడి సహకరించాలి ● గోళ్లపాడు గ్రామసభలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంరూరల్: భవిష్యత్ తరాలకు మేలు చేయడమే లక్ష్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అంతా కలిసిరావాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.సూచించారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు రైతు వేదికలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన స్థానికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హులకు అందజేయడం, సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా అందరూ సహకరించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాక గ్రామస్తులు జీవన విధానంలో మార్పులు చేసుకుంటేనే కోతుల బెడద తదితర సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా, వానాకాలం సీజన్లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించి న ఆయన.. రైతులు నానో యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాక వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగు చేయాలని తెలిపారు. ఈక్రమంలో పలువురు ఎస్ఐఆర్పై సందేహాలు వ్యక్తం చేయగా అర్హులెవరి ఓట్లు తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో అపోహలు విడనాడి సిబ్బందికి సహకరించాలని సూచించారు. అంతేకా క వరదల నివారణ చర్యలు, ముంపు ఎదురైతే అనుసరించాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ సూచనలు చేశారు. ఇంకా ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి బి.జ్యోతి, ఆత్మ పీడీ బి.సరిత, ఏఓ ఉమా నగేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖమ్మం సహకారనగర్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఎస్ఐఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విలాస్ దుబే, అమృత గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీ, డిజిటలైజేషన్పై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ పూర్తయ్యాక సూపర్వైజర్లు ధ్రువీకరించాలని తెలిపారు. అర్హులందరికీ ఓటు హక్కు దక్కేలా రాజకీయ పార్టీలకు అనుబంధం లేని వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు.


