గాడి తప్పితే వేటే..!
నిర్లక్ష్యంపై వేటు తప్పదు
● విద్యాశాఖపై అధికార యంత్రాంగం దృష్టి ● మూడు నెలల్లో 70 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ● ఎనిమిది మందిపై సస్పెన్షన్ వేటు
ఖమ్మంసహకారనగర్: ఇటీవలి కాలంలో విద్యాశాఖ గాడి తప్పినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం దృష్టిసారించింది. విధుల్లో నిర్లక్ష్యం, పలు కార్యక్రమాల అమలులో అలసత్వం, విద్యార్థుల విషయంలో పట్టింపులేనితనంతో ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారని, సమయపాలన మచ్చుకు పాటించడం లేదని, ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం) అమలు గాలికొదిలేశారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించడం లేదు. మూడు నెలల కాలంలో 70 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. పలు అంశాల్లో మొత్తం 8 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈసీఆర్ అమలుపై శ్రద్ధ..
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ రాయగలగాలని, చదవాలనే ఉద్దేశంతో ఈసీఆర్ (ఏవ్రీ చైల్డ్ రీడ్స్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పలు శాఖల అధికారులను సైతం పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. ఈసీఆర్పై ప్రత్యేక అధికారులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనాను నియమించారు. వారు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యాశాఖ పనితీరుపై అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు సస్పెండ్ చేయటం లాంటి కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.
కఠిన చర్యలు..
అలసత్వంతో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 70 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. ఎనిమిది మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ముఖ్యంగా పలు పథకాలు, కార్యక్రమాల అమలులో కొందరు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో పట్టింపులేనితనంతో వ్యవహరిస్తుండటంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తుండగా.. ఓ ఉపాధ్యాయుడిని ఏకంగా టర్మినేట్ చేయటం గమనార్హం. దీంతో ఉపాధ్యాయులు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా విచారణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటున్నాం. సస్పెండ్ కూడా చేస్తున్నాం. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా సహించేది లేదు. ఎఫ్ఆర్ఎస్ను తప్పనసరిగా అమలు చేయాలి.
–చైతన్య జైనీ, డీఈఓ
గాడి తప్పితే వేటే..!


