ఇళ్లు కోల్పోయిన పేదలకు అండగా ఉంటాం..
ఖమ్మంవైరారోడ్: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు అండగా ఉంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం పువ్వాడ అజయ్కుమార్ భూదాన్ బాధితులను హైదరాబాద్ పిలిపించుకొని, లీగల్ సెల్ బాధ్యులతో మాట్లాడారు. బాధితుల తరఫున కోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పగడాల నాగరాజు, మేకల సుగుణారావు, బత్తుల మురళి, దేవాళ్ల వీరన్న, సంపంగి వెంకటేశ్వర్లు, సంపంగి వెంకటాచలం, బండి శ్రీను, జారా ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల
కేటాయింపునకు కసరత్తు
అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
ఖమ్మంఅర్బన్: భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయిన బాధితుల వివరాలను అధికారులు ఒకవైపు సేకరిస్తుండగా, మరోవైపు అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వ స్థలాలు కేటాయించేందుకు అనువైన ఖాళీ భూములపై ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కూల్చివేతలో సుమారు 705 మంది ఇళ్లు కోల్పోయినట్లు తెలిసింది. బాధితుల జాబితాలో ఇతర జిల్లాలకు చెందినవారి పేర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన వారు 616 మంది, వరంగల్ 1, హనుమకొండ 3, మహబూబాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం–52, సూర్యాపేట–14, ఏపీ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి–1, కృష్ణ–1 ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు సుమారు 188 మంది, రఘునాథపాలెం మండలానికి చెందిన 27 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు జిల్లాలోని వివిధ మండలాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్హులుగా తేలిన వారికి ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు.
ఇళ్లు కోల్పోయిన పేదలకు అండగా ఉంటాం..


