నష్టం మిగిల్చిన వాన..
కొణిజర్ల: మండల కేంద్రంతో పాటు పెద్దగోపతి, పెద్దమునగాల, కాచారం, కొండవనమాల తదితర గ్రామాల్లో వరి పంట వర్షం, ఈదురుగాలులకు నేలకొరిగింది. గింజ పాలు పోసుకునే దశలో ఈ పరిస్థితి ఎదురవడంతో సగానికి పైగా దిగుబడి తగ్గుతుందని వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో నీటి సరఫరా నిలిపివేయడంతో ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు ప్రకృతి మరింత కన్నెర్ర చేసింది.
వేంసూరు: మండలంలో వర్షం కారణంగా ధాన్యం రాశులపై కప్పిన పట్టాలపై నీరు నిలవగా ఆరబెట్టిన ధాన్యం తడవడంతో పాటు మామిడి కాయలు నేలరాలాయి.
తిరుమలాయపాలెం: మండలంలోని ఎదుళ్లచెరువు, జింకలగూడెం, పిండిప్రోలు, కొక్కిరేణి, బీరోలు తదితర గ్రామాల్లో పంటలు తడిసిముద్దయ్యాయి. ధాన్యం, మిర్చి, మొక్కజొన్న రాశులు తడిశాయి. తద్వారా మిర్చి రంగు మారుతుందని, మొక్కజొన్న నాణ్యత తగ్గనున్నందున ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
తల్లాడ: మండలంలో వర్షంతో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. తల్లాడ, రేజర్ల, గొల్లగూడెం, బిల్లుపాడు, అన్నారుగూడెం, మల్లవరం, తెలగవరం, నూతనకల్, మిట్టపల్లిల్లో తేమ శాతం వచ్చినా కాంటా వేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఇక మామిడి తోటల్లో కాయలు గాలివానకు రాలాయి.
పెనుబల్లి: మండలంలోని లింగగూడెం, ఏరుగట్ల, భవన్నపాలెం, చౌడవరం, పార్థసారథిపురం తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వరి నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట నేలపాలైనందున తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేలకొండపల్లి: మండలంలోని నేలకొండపల్లి, చెరువుమాధారం, మంగాపురం, ముజ్జుగూడెం, పైనంపల్లిల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యం కాంటా వేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కూసుమంచి: మండలంలోని పలు గ్రామాల్లో వర్షంతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో బుధవారం ఉదయం నుంచే రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు విక్రయానికి తీసుకొచ్చిన మిర్చి బస్తాలను తడవకుండా రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి రక్షించుకున్నారు.
వైరారూరల్: గరికపాడు, దాచాపురంలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులు తడిచాయి. కొన్నిచోట్ల రైతులు ముందుగానే కప్పిన పట్టాలపైనా నీరు నిలిచింది.
ముదిగొండ: పలు గ్రామాల్లో వర్షంతో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
రఘునాథపాలెం: కొత్తగూడెం, ధంసలాపురం, గోపాలపురం, గణేశ్వరం, చింతగుర్తి తదితర గ్రామాల్లో వరితో పాటు మొక్కజొన్న, బొప్పాయి, మామిడి తోటలకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు.
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..
నష్టం మిగిల్చిన వాన..


