● బెంగళూరు సైబర్ క్రైం సీఐ మృతి
● ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
యశవంతపుర: మధ్యప్రదేశ్లోని రాజ్గడ్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరు సైబర్ క్రైం పోలీసు సీఐ దుర్మరణం చెందగా ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఒక కేసుకు సంబంధించి నిందితులను పట్టుకోడానికి బెంగళూరు ఆగ్నేయ విభాగంలో సైబర్ క్రైం స్టేషన్ సీఐ కేబీ రవి(58), కానిస్టేబుళ్లు విశ్వనాథ్, రమేశ్ మధ్య ప్రదేశ్లోని రాజ్గడ్కు వెళ్లారు. కాన్పూరు నుంచి ఇండోర్కు బస్సులో వెళ్తుండగా అతి వేగంతో అదుపుతప్పి రాజ్గడ్ వద్ద బియోరా భూపాల్ బైపాస్ వంతెన గోడను ఢీకొంది. దీంతో సీఐ రవి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని రాజ్గడ ఎస్పీ అమిత్ టోలాని తెలిపారు. ఘటనా స్థలాన్ని మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ సింగ్ పన్వార్ పరిశీలించారు. ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు.
ముడా స్థలాల రద్దు
మైసూరు: మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార (ముడా) 2019 నుంచి 2023 వరకు 50:50 నిష్పత్తిలో కేటాయించిన మొత్తం 1000కి పైగా స్థలాలను రద్దు చేసినట్లు మైసూరు జిల్లా ఇన్చార్జి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముడా కేటాయించిన 50:50 స్థలాల్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతానికి అన్ని స్థలాలను రద్దు చేశాం. ఈ విషయమై పూర్తి ఉత్తర్వులను మేం అథారిటీకి పంపాం. అధికారులు ఉత్తర్వులను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 2018కి ముందు స్థలాలు పొందిన వారిపై కూడా సమీక్ష నిర్వహించాం‘ అని అన్నారు. అక్కడ ఏవైనా అవకతవకలు ఉంటే, వాటిని కూడా రద్దు చేస్తామని ఆయన అన్నారు. రోడ్డు కోసం తమ భూమిని ఇచ్చి, పరిహారం పొందిన వారికి కూడా స్థలాలు కేటాయించారు. అనేక అవకతవకల నేపథ్యంలో అన్నింటినీ రద్దు చేశామని ఆయన స్పష్టం చేశారు. న్యాయ వివాదంలో ఉన్న స్థలాల విషయంలో తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో మంత్రి నాగేంద్ర ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే, బీజేపీ సభలో చర్చకు వచ్చి ఉండాల్సింది. కానీ బీజేపీ గొడవ చేసి సమావేశాన్ని రసాభాస చేసిందని ఆయన అసంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి నాగేంద్ర విషయంలో ముఖ్యమంత్రి, హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
ఐఏఎస్ జ్ఞానేంద్రకుమార్పై సీఐడీ ముమ్మర విచారణ
బనశంకరి: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన పశువైద్యాధికారుల నియామకం కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబంధించి అదృశ్యమైన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. జ్ఞానేంద్రకుమార్ గురువారమే సీఐడీ విచారణకు హాజరుకావాల్సింది. కానీ గైర్హాజరు కావడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు జ్ఞానేంద్రకుమార్ సీఐడీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ముందు విచారణను ఎదుర్కొన్నారు. గతంలో కేపీఎస్సీలో పరీక్షల విభాగం కంట్రోలర్గా ఉన్న జ్ఞానేంద్రకుమార్ హయాంలో పశువైద్యాధికారుల నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సీఐడీ అధికారుల బృందం జ్ఞానేంద్రకుమార్ను విచారణ చేపట్టి కూపీ లాగుతున్నారు.


