● కరువుతో ఇబ్బందుల్లో అన్నదాతలు
● రుణాలు తిరిగి చెల్లించమని వేధించొద్దు
● కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి
మైసూరు: రాష్ట్రంలో కరువు నేపథ్యంలో మైసూరు జిల్లాలోని 8 తాలూకాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున రుణాలు తిరిగి చెల్లించమని రైతులను వేధించడం లేదా ఒత్తిడి చేయరాదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామి బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మైసూరులోని జెడ్పీ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల బీమా కోసం పేర్లు నమోదు చేసుకోవడంలో రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కరువు కారణంగా ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు బీమా నష్టపరిహారం అందించాలన్నారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
సంయుక్త సర్వే నిర్వహించండి
రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్న జిల్లాల్లో రైతులు వేసిన పంటల పరిస్థితిపై సంయుక్త సర్వే నిర్వహించి, అధికారులు నివేదిక సమర్పించాలని సూచించారు. రైతులకు కరువు సహాయక చర్యలు పారదర్శకంగా అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. జొన్న పంటలో తెల్ల కుళ్లు తెగులును పరిగణనలోకి తీసుకుని, పంట నష్టానికి పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన జిల్లాధికారులను ఆదేశించారు. త్వరలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇస్తామని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు.


