బనశంకరి: ఎల్నినో విపత్తు కన్నడనాడును అతలాకుతలం చేస్తోంది. వానలు కురవడమే గగనమైంది. కరువు వల్ల మనుషులు, పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. ఇప్పటికీ ఎండ వేడిమి, పొడి వాతావరణం వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 101 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. గురువారం విధానసౌధలో రెవెన్యూ, డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తరువాత విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాల కొరత వల్ల తీవ్ర కరువు ఏర్పడిందని తెలిపారు. తొలి విడతగా 101 తాలూకాలను కరువుపీడిత ప్రాంతాలుగా ప్రకటించామని, వీటిలో 89 తాలూకాల్లో తీవ్ర కరువు, 12 తాలూకాల్లో సాధారణ కరువు నెలకొందన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితిని అవలోకన చేసి కరువు తాలూకాలను ప్రకటిస్తామని చెప్పారు.
40 శాతం తక్కువ వానలు
కరువును ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు, తీవ్ర వర్షాభావం వ్యవసాయ రంగానికి ఇబ్బందిగా మారినట్లు డీసీఎం చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి, దక్షిణ ఒళనాడులో 41శాతం, మలెనాడులో 35 శాతం, ఉత్తర ఒళనాడులో 31 శాతం, కరావళిలో 24 శాతం తక్కువ వర్షం కురిసిందని వివరించారు. వర్షాలు రాకపోతే, రానున్న రోజుల్లో రాష్ట్రంలో 2,069 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చునని సూచించారు. 758 గ్రామాలకు 149 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ప్రధానిని కలుస్తాం
రాష్ట్రంలో ఏర్పడిన దుర్భిక్షంపై త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్రానికి అదనపు సాయం అందించాలని కోరతామని పరమేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో 29 జిల్లాల్లో 190 తాలూకాల్లో తీవ్ర అనావృష్టి ఏర్పడిందని, 12 తాలూకాల్లో తీవ్ర దుర్భిక్షం ఉందని చెప్పారు. 26వ తేదీ నాటికి వరుసగా 3, అంతకంటే ఎక్కువ వారాలు వర్షమే కురవలేదని వాపోయారు.
నిధులు ఇస్తున్నాం
తాగునీటి సరఫరా కోసం 31 జిల్లాలకు రూ.117 కోట్లు, 189 గ్రామీణ ప్రాంతాలకు తలా రూ.కోటి చొప్పున మొత్తం 306 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కరువు పనులకు నిధుల కొరత లేదని అన్నారు. కాగా కరువు పీడితాలుగా ప్రకటించడం వల్ల ఆ ప్రాంతాలకు కేంద్ర, రాష్ట్రాల నుంచి అధిక ఆర్థిక సాయం అందుతుంది. తద్వారా వేగంగా కరువు నివారణ చర్యలు చేపట్టవచ్చు.
101 తాలూకాలలో కరువు తాండవం
డిప్యూటీ సీఎం పరమేశ్వర్ ప్రకటన
89 తాలూకాలలో అధ్వానం
కరువు సర్వే ఇలా చేశారు
కేంద్ర ప్రభుత్వ కరువు మార్గదర్శకాలు– 2020 ప్రకారం కరువుకు అద్దం పట్టే రెండు ప్రధాన ట్రిగ్గర్ పాయింట్ల ప్రకారం తాలూకాలలో పరిశీనల చేశామన్నారు. 134 తాలూకాలు కేంద్ర ట్రిగ్గర్–1 నిబంధనలకు లోబడి ఉన్నాయన్నారు.
ఇంకా 32 తాలూకాలలో పరిశీలన చేయలేదన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కరువుపై అధ్యయనం చేస్తున్నామని, బాకీ ఉన్న తాలూకాలలో సర్వేచేసి ప్రకటిస్తామన్నారు.


