బనశంకరి: సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన వెంటనే మంత్రి బీ.నాగేంద్ర కూడా వెళ్లారు. వాల్మీకి మండలి స్కాంలో నిందితుడైన నాగేంద్ర రాజీనామా చేయాలని బీజేపీ పోరాడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకమాండ్ నేతలను కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బళ్లారి మాజీ మంత్రులు బీ.శ్రీరాములు, జనార్దనరెడ్డి అక్రమాల ఆధారాలు ఉన్నాయని, వారిపై పోరాటం సాగిస్తానని ఆయన హైకమాండ్కు సమాచారమిచ్చినట్లు తెలిసింది. అంతేగాక విపక్షాలు చేపట్టే పాదయాత్రకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు. తాను పార్టీకి ఇబ్బందిగా మారితే మంత్రి పదవికి రాజీనామా చేయాలని నాగేంద్ర నిర్ణయించినట్లు సమాచారం.
1 నుంచి పాదయాత్ర: విజయేంద్ర
నాగేంద్ర రాజీనామా చేయాలని రాయచూరు నుంచి బళ్లారి వరకు భారీ పాదయాత్ర చేస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర తెలిపారు. 1వ తేదీ నుంచి కళ్యాణ కర్ణాటక ప్రాంతాల గుండా సాగి 10వ తేదీన బళ్లారికి చేరుకుంటుందని, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
విస్తరణ తెలియదు: ఖర్గే
యశవంతపుర: రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ గురించి తనకు తెలియదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గురువారం కలబుర్గిలో మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ చేయాలంటే ఆ ఫైల్ నా వద్ద నుంచే వెళ్లాలి కదా అని విలేకరులతో అన్నారు. ఫైల్ వస్తే మీకు చెబుతానని చమత్కరించారు.
నాగేంద్రకు సీఎం డీకే మద్దతు
ఆ స్కాంలో నాగేంద్ర తప్పు లేదు: సీఎం శివ
బనశంకరి: సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో హైకమాండ్ నేతలతో చర్చలు జరిపారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ వాల్మీకి మండలి నిధుల అక్రమ బదిలీ కేసులో మంత్రి నాగేంద్ర మీద ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పారు. ఆయన రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. నాగేంద్ర నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, పార్టీకి సమర్థమైన కార్యకర్త అని పేర్కొన్నారు. రాహుల్గాంధీని కలిసి కర్ణాటక రాజకీయ పరిస్థితులపై చర్చించామని, త్వరలో రాహుల్గాంధీ బెంగళూరులో పర్యటించి గిగ్వర్కర్స్ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.


