మైసూరు: ప్రపంచ విఖ్యాత నాడ హబ్బ మైసూరు దసరా పండుగ కోసం అడవుల్లోని వివిధ శిబిరాల నుంచి ఆర్భాటంగా మైసూరు నగరానికి చేరుకున్న ఏనుగులు గురువారం ప్రశాంతంగా గడిపాయి. శుక్రవారంనాడు భారీ ఊరేగింపు నడుమ అంబావిలాస్ ప్యాలెస్లో ఆవరణలోకి ప్రవేశిస్తాయి. గజపయన ద్వారా 9 ఏనుగులు బుధవారం మధ్యాహ్నం మైసూరులోని అరణ్య భవనకు చేరుకున్నాయి. ఏనుగులను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కన గుమిగూడారు. అందరూ ఉత్సాహంగా ఏనుగులకు స్వాగతం పలికారు. ఆ వీడియోలను మొబైల్ ఫోన్లలో బంధించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంబరపడ్డారు.
నేడు మరో వేడుక
ఉదయం గజరాజులకు మావటీలు, కాపలాదారులు స్నానం చేయించారు. ప్రయాణపు అలసటను అధిగమించిన ఏనుగులు మేతమేస్తూ నెమ్మదిగా ఉన్నాయి. చాలా ఏనుగులకు అరణ్య భవన్, మైసూరు సుపరిచితం కావడంతో ఇబ్బందేమీ రాలేదు. నగరంలో లభించే భోజనాన్ని రుచిచూసేందుకు ఏనుగులు ఎదురుచూస్తున్నాయి. భారీ ఊరేగింపుగా పవిత్రమైన తులారాశి లగ్నంలో శుక్రవారం ఉదయం 9:52 నుంచి 10:19 గంటల మధ్య జయ మార్తాండ ద్వారం ద్వారా ప్యాలెస్ ఆవరణలోకి తీసుకెళ్తారు. కోడి సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో బస ఏర్పాటు చేస్తారు. ఇకపై ప్రతి ఉదయం, సాయంత్రం, ఏనుగులకు జంబుసవారీ మార్గంలో నడక సాగిస్తారు.
ప్రశాంతంగా దసరా గజరాజుల బస
నేడు అంబావిలాస్ ప్యాలెస్లోకి ప్రవేశం


