శివాజీనగర: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో ఏ మంత్రి కాని, ఎమ్మెల్యేల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదు. అధికారులు ఆత్మసాక్షికి అనుగుణంగా, పారదర్శకంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత స్థాయి అధికారుల సమావేశం తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనలో ప్రభావం కలిగిన వారికి తలొగ్గే సంస్కృతికి బ్రేక్ వేస్తామనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఏ ప్రజాప్రతినిధుల ఒత్తిడికి బలికాకుండా చట్టబద్ధమైన పనులు చేయండి. తమ ప్రభుత్వంలో కులం, మతం కాని ఇతర ఎలాంటి ప్రభావాలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. పరిపాలనలో వేగాన్ని పెంచేందుకు రాబోయే 15 రోజుల్లో అన్ని శాఖలు తమ ‘యాక్షన్ కార్డు’ను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సామాన్యుల వినతులను నేరుగా ఆలకించేందుకు కొత్తగా ‘ప్రత్యేక శాఖ’ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఈ కొత్త శాఖ బాధ్యతలను చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమించనున్నట్లు ప్రకటించారు.
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం విధానసౌధలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీలను నియంత్రించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. యువకులు మత్తు పదార్థాల బారినపడకుండా నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ విక్రయాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగేలా పనితనం చూపించాలన్నారు.
అధికారులకు డీకే శివకుమార్ సూచన


