● క్రికెట్ ప్రియులకు ఆనందం
శివాజీనగర: బెంగళూరు క్రికెట్ అభిమానులకు శుభవార్త వినిపించింది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీం ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో మొత్తం 7 పోటీల్లో 5 మ్యాచ్లను బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతోంది. మరో 2 మ్యాచ్లు చత్తీస్గడ్లో ఆడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, క్రికెట్ సంఘం ప్రయత్నాలతో ఇది ఓ కొలిక్కి వచ్చింది.
మొదటి మ్యాచ్ ఇక్కడే
గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం తెలిసిందే. అప్పటి నుంచి మ్యాచ్లను బంద్ చేశారు. ఇకపై మ్యాచ్ల సమయంలో మరింతగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఈసారి ఐపీఎల్ ప్రారంభ పోటీ చిన్నస్వామిలోనే జరగనుంది.
రూ.55 లక్షల గంజాయి సీజ్
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ అమ్ముతున్న ఒడిశావాసి లింగరాజ్దాస్(24)ను మంగళవారం బెంగళూరులోని వైట్ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.55 లక్షల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 27 కేజీల గంజాయి, 3 కేజీల హషిష్ ఆయిల్, బైకును సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. నాగొండనహళ్లిలో వాహనాలు తనిఖీ చేస్తున్న లింగరాజ్ పట్టుబడ్డాడు. నగరంలో ఐటీ బీటీ ఉద్యోగులు, ప్రజలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపాడు.
ఉగాండా మహిళల నిర్బంధం
మైకో లేఔట్లో వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న ఉగాండావాసులు రషీదా, జామ్కాలిస్కి అనే మహిళలను అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు. డీసీపీ సైదులు పాల్గొన్నారు.
బీఈఓ, బ్రోకరుకు కటకటాలు
● లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత
శివమొగ్గ: జిల్లాలో భద్రావతి నగరంలోని బీఈఓ కార్యాలయంలో అదే ఆఫీసు ఉద్యోగి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ బీఈఓ నాగేంద్రప్ప, మధ్యవర్తి మంజునాథ్ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వివరాలు.. విద్యాశాఖ ఉద్యోగి లింగరాజుకు కొన్ని కారణాల వల్ల జీతం పెండింగ్లో పడింది. 2011 నుంచి 2023 వరకు రావాల్సిన జీతం, పదోన్నతి, ఇతర భత్యాలను మంజూరు చేయాలని బీఈఓ, ఉన్నతాధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేశారు. కానీ పని మాత్రం జరగలేదు. ఇంతలో, బీఈఓ, బ్రోకరు కలిసి నీ పని జరగాలంటే రూ.4 లక్షలు ఇచ్చుకో అని తెలిపారు. దీనిపై లింగరాజు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం ఆఫీసులోనే మొదటి కంతుగా రూ. 1 లక్ష ఇస్తుండగా, లోకాయుక్త పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు.
నోరూరేలా..
నిప్పు లేని వంటలు
● మైసూరులో మహిళలకు పోటీలు
మైసూరు: వంట చేయాలంటే, రుచికరమైన వంటకాలను వండాలంటే నిప్పు కావాలి. కానీ నిప్పుతో పనిలేని వంటకాలను చేసి చూపించారు మహిళామణులు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైసూరులో నేగిలయోగి మహిళా సంక్షేమ సేవా సంఘం ఈ వంటల పోటీని నిర్వహించింది. 25 మందికి పైగా మహిళలు దాదాపు 40 రకాల వైవిధ్యమైన
వంటకాలను వండివార్చారు. కూరగాయలు, పండ్లతో కూడిన సలాడ్లు, ఇతరత్రా నోరూరించే పదార్థాలను సిద్ధం చేసి అబ్బుపరిచారు. ఎస్డీఎం మహిళా మహావిద్యాలయ ప్రొఫెసర్
డాక్టర్ వినోద, విద్వాన్ రఘు, జె.శోభ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు ఎన్ని విజయాలు సాధించినా, కుటుంబానికి ఆలంబన అయిన వంటగదిని మర్చిపోకూడదని అన్నారు. ఆటలు, పాటల పోటీల్లో వనితలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మధ్యవర్తి మంజునాథ్


