రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలను నిలిపి వేయాలని, వారికి 6 శాతం రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక చలువాది మహాసభ తాలూకా సంచాలకుడు హేమరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
పంటలకు
మద్దతుధర ప్రకటించండి
రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు పూజార్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, పెసలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు పండించిన జొన్నలకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వారం రోజుల్లో రైతులకు ధాన్యం విక్రయ సొమ్మును అందించాలని, గోదాముల్లో నిల్వ ఉంచుకోడానికి అనుకూలం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న జొన్నల రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు.
హెల్ప్లైన్ల ఏర్పాటు
హొసపేటె: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అస్థిర పరిస్థితి ఏర్పడి విమాన సేవలలో అంతరాయం ఏర్పడింది. అనేకమంది కన్నడిగులు ఆయా దేశాలలో చిక్కుబడిపోయారు. ఈ సందర్భంగా విజయనగర జిల్లా ప్రజల కోసం అత్యవసర సహాయవాణిని ప్రారంభించినట్లు జిల్లాధికారి కవిత తెలిపారు. ఎవరైనా సాయం కావలసినవారు 08394–295655, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 9480805700, 080–22340676, 080–22253707 టోల్ ఫ్రీ నంబర్ : 1070లో సంప్రదించవచ్చని తెలిపారు.
ఉద్యోగాల భర్తీకి
చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 52,432 ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజుల క్రితం ధార్వాడ, కలబుర్గి, బాగల్కోటల్లో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నియామకాలకు చర్యలు తీసుకుందన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు.
జడ్పీలో కేఫ్ ప్రారంభం
మైసూరు: మంత్రి హెచ్.సీ. మహదేవప్ప ఇక్కడి జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన అక్క కేఫ్ను ప్రారంభించి ఆహారాన్ని ఆరగించారు. నాణ్యత బాగుండాలని సిబ్బందికి సూచించారు. పనుల కోసం వచ్చే ప్రజలకు కేఫ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే తన్వీర్ సేట్, కాంగ్రెస్ నేత అరుణ్ కుమార్, జడ్పీ అధికారి యుకేష్ కుమార్, కమిషనర్ షేక్ తన్వీర్ ఆసిఫ్ పాల్గొన్నారు.


